ఉజ్జయిని: కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్లు వేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతాలను విడుదల చేయనున్నట్లు స్పష్టంచేసింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్లు సమర్పించిన వారికి మాత్రమే జూలై నెల జీతాలు వేయనున్నట్లు తెలిపింది.
జూలై 31 లోపు జిల్లాకు చెందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉజ్జయిని జిల్లా కలెక్టర్ అశీశ్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక వివిధ ప్రభుత్వ విభాగాల్లో దినసరి కూలీలుగా, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసే వారు కూడా వ్యాక్సిన్లు వేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల హెడ్లను కలెక్టర్ ఆదేశించారు.