పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని ఖుదావంద్పూర్లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరోళ్ల భీమమ్మ(55)ఆమె కుమారుడు ఎరోళ్ల బలవంత్. తన తల్లికి పింఛన్ డబ్బులు వచ్చిన విషయం తెలుసుకుని డబ్బుల విషయంలో తల్లితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో మద్యం మత్తులో తన తల్లి మెడకు విద్యుత్ వైరును బిగించి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు తన ఇంటికి కొద్ది దూరంలో ఉండే తన చిన్నమ్మ అయిన రాములమ్మ ఇంటికి వెళ్లి మా అమ్మ పలుకుత లేదు ఏమైందో వచ్చి చూడాలని చిన్నమ్మ కుమారులు బాల్రాజ్, భాస్కర్ను కోరాడు.
గతంలోనే తల్లిని చంపేస్తానని పలుమార్లు హెచ్చరించిన బలవంత్ తీరుపై వారికి అనుమానం వచ్చి నేరుగా విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ శవాన్ని పరిశీలించారు. అనంతరం హత్యపై కాలనీవాసులను, గ్రామస్తులను ఆరాతీసి బలవంత్ తీరుపై అనుమానం వచ్చిన అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్టేషన్కు తరలించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం తల్లితో గొడవపడేవాడని పలుమార్లు సర్ది చెప్పిన ఎవ్వరిని లెక్క చేయకుండా జులాయిగా తిరిగేవాడని కాలనీవాసులు పోలీసులకు వివరించారు.
బలవంత్ చెడు వ్యసనాలకు గురై తరుచు తల్లితో పాటు కట్టుకున్న భార్యను కూడా వేధిస్తుండేవాడని భర్త బాధ భరించలేక భార్య రమాదేవి తన తల్లిగారి ఇంటికి రెండు సంవత్సరాల క్రితమే వెళ్లి పోయిందని తెలిపారు. తల్లిని చంపిన బలవంత్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.