సంగారెడ్డి : జిల్లాలోని పుల్కల్ మండలం చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. మృతులను మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, సంగాయీపేట గ్రామాలకి చెందినవారిగా గుర్తించారు. వీరంతా సంగారెడ్డిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు. మృతులు సంగాయీపేట గ్రామానికి చెందిన పుర్ర అంబదాస్(40), ఇతని భార్య పద్మ(30), వీరి కొడుకు వివేక్(6), అదేవిధంగా రంగంపేటకు చెందిన పాస్టర్ లూక(40), ఇతడి భార్య దీవెన. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్పీ బాలాజీ, పుల్కల్ ఎస్ఐ ప్రమాద వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.