బెంగళూర్ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ విపత్తు సమయంలోనూ అక్రమార్కులు సొమ్ము చేసుకునేందుకు బరితెగిస్తున్నారు. పారాసిటమాల్ లో సెలైన్ సొల్యూషన్ కలిపి రెమ్డిసివిర్ వయల్స్ లో నింపి కొవిడ్-19 రోగులకు విక్రయిస్తున్న ముఠాను మైసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆరు నెలలుగా వీరు 900 మంది రోగులకు రెమ్డిసివిర్ రీసైకిల్డ్ డోసులను విక్రయించినట్టు గుర్తించామని మైసూర్ పోలీస్ కమిషనర్ చంద్రగుప్త వెల్లడించారు.
ఈ రాకెట్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నర్సు సహా ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఒరిజినల్ రెమ్డిసివిర్ బాటిల్స్ లో వీరు ఇతర యాంటీబయాటిక్ లను సెలైన్ ను కలిపి విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి 40 రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు, రూ 2.82 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మార్కెట్ లో రూ వేయి నుంచి ఐదు వేల మధ్య లభించే రెమ్డిసివిర్ ను అక్రమంగా నిల్వ చేసిన వారు రూ 20,000 వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.