కట్టంగూర్, సెప్టెంబర్ 19: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఒకేచోట అరగంట వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఐపరాజుపాలెంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కదిరి గోపాల్రెడ్డి (31), భార్య రచన (30), కూతురు రియాన్స్(5), స్నేహితుడు కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ప్రశాంత్(24)తో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఒంగోలు బయలుదేరారు. ఉదయం 8.30 గంటల సమయంలో ముత్యాలమ్మగూడెం శివారులోని గచ్చుగూరు వద్ద ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టారు. కారు పల్టీలు కొడు తూ రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. కారులోఉన్న గోపాల్రెడ్డి, ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రచన, రియాన్స్ను నార్కట్పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. రచన చికిత్సపొందుతూ మృతిచెందింది.
ట్రాఫిక్ జామ్లో మరో ప్రమాదం
కారులో ఇరుక్కుపోయిన రచన, చిన్నారి రియాన్స్ను క్రేన్సాయంతో బయటకు తీసేందుకు పోలీసులు సహాయకచర్యలు చేపడుతుండగా.. 200 మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్లో నిలిచిన సిమెంట్ లారీని వేగంగా వచ్చిన మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ఉన్న వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరుకు చెందిన జంగం శివప్రసాద్(23), హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన వినయ్ప్రసాద్(21) అక్కడికక్కడే మృతిచెందారు. వీరు సూర్యాపేటలోని సత్యసాయి మందిరంలో అభిషేకం చేసేందుకు కారులో హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మొత్తం ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సీఐ నాగదుర్గాప్రసాద్ తెలిపారు. వేగాన్ని అదుపు చేయలేక లారీలను ఢీకొట్టారని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రకటించి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.