హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఆలయాలనూ వదలట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజారులు, సిబ్బందికి కొవిడ్ సంక్రమించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాల్లో ఈ సమస్య మరీ అధికంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆలయాల్లోకి భక్తుల రాకను, ఆర్జిత సేవలను నిషేధించాలని దేవాదాయ ధర్మాదాయశాఖ నిర్ణయించింది. ధూపదీప నైవేద్యాలు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామి సన్నిధి, ధర్మపురి నరసింహస్వామి ఆలయం, కీసర శివాలయం, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, మహంకాళి ఆలయం, కర్మన్ఘాట్, సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమంతుడి గుడి తదితర ఆలయాల్లో నిత్యం పూజలు, వ్రతాలతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది వేలకుపైగా ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కింద నెలకు రూ.6 వేలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గతంలో ఆలనాపాలనా సరిగా లేని ఆలయాలకు ఇప్పుడు భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి తోడు కరోనా ఉద్ధృతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా సోకింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ సాయిబాబా ఆలయ పూజారి కరోనాతో ఇటీవల మరణించారు. ఇటీవల పాత నగరంలోని ఓ పూజారికి వ్యాధి తీవ్రత అధికం కావడంతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్థానిక దవాఖానలో చేర్పించేందుకు సాయం చేశారు. జిల్లా కేంద్రాలు, గ్రామీణ ఆలయాల్లో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తమ ఆధీనంలోని 18 వేల చారిత్రక క్షేత్రాలను మూసివేయాలని ఇటీవల ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్రంలోని జోగులాంబ, వేయి స్తంభాలగుడి, రామప్ప తదితర ఆలయాలను వచ్చే నెల 15 వరకు మూసివేశారు.
ఆలయాలు మూసేయండి: అర్చక సంఘం
కరోనా తీవ్రత, పూజారులు వ్యాధిబారిన పడుతున్న దృష్ట్యా ఆలయాలను మూసివేయాలని శనివారం రాష్ట్ర అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని, పూజారులు, భక్తుల క్షేమం కోసం కొంతకాలంపాటు ఆర్జిత సేవలు, భక్తుల ప్రవేశాలపై నిషేధం విధించాల్సిన అనివార్యత ఉందని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు.