హైదరాబాద్, జూన్ 19,(నమస్తే తెలంగాణ): ఏ సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా అన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అన్ని రంగాల్లో అత్యంత బలంగా ఉందన్నారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన ఫ్లైయింగ్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 161 మంది నూతన ఫ్లైయింగ్ కెడెట్లు, ఆరుగురు నేవీ, ఐదుగురు కోస్ట్గార్డు కేడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించి విధుల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బదౌరియా మాట్లాడుతూ ఉత్తమ కేడెట్లుగా తీర్చిదిద్దన ఎయిర్ఫోర్స్ అకాడమీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశ చరిత్రలోనే ఈ బ్యాచ్ అత్యధికంగా 20,500 గంటల పాటు ఫ్లైయింగ్ ట్రైనింగ్ చేసిందని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం తమను తాము మలుచుకోవాలని యువ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దేశ భద్రతలో వాయుసేన పాత్ర అత్యంత కీలకమన్నారు. రక్షణ రంగాల అవసరాలకు అనుగుణంగా వాయుసేనను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కొవిడ్ కాలంలో వాయుసేన 3800 గంటల పాటు నిరంతర సేవలు అందించిందన్నారు. శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు పతకాలు బహూకరించారు.
2022 వరకు పూర్తిస్థాయిలో 36 రాఫెల్ యుద్ధవిమానాలు వాయుసేనలో చేరతాయని ఎయిర్చీఫ్ మార్షల్ బదౌరియా తెలిపారు. విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని.. మిగ్-21 తో పాటు ఏ ఇతర విమానాలైనా పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పుడే వినియోగిస్తామన్నారు. మరో రెండు మూడేండ్లలో మిగ్-21 స్థానంలో ఇతర విమానాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఫైటర్ పైలెట్ ఆకాశంలో ఉండగానే టార్గెట్ మారినా అందుకు తగ్గట్టుగా రియల్ టైంలో సమాచారం అందేలా సాంకేతికత వాడుతున్నామని బదౌరియా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పరేడ్కు వాయుసేన ఉన్నతాధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతించారు. కేడెట్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల కోసం లైవ్ కవరేజీ అందించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీం, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అబ్బురపరిచాయి.