కొన్నేండ్ల క్రితం నుంచే ఫుడ్ ఆన్లైన్ డెలివరీలకు గిరాకీ పెరిగింది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ప్రకటించడంతో అందరూ ఇంటి తిండే తిన్నారు. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేశారో, అప్పట్నించీ మళ్లీ జనం రెస్టారెంట్లకు వెళ్లడం, ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో హోటళ్లన్నీ కస్టమర్లకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన సర్వీస్ అందించాలనుకున్నాయి. ఆ క్రమంలోనే కొత్త కొత్త ఐడియాలతో ఆన్లైన్ కస్టమర్లను ఆకర్షించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఫుడ్ ప్యాకింగ్ విషయంలో క్రియేటివిటీకి పని చెప్తున్నాయి.
హోమ్ డెలివరీ టీ కెటిల్..
హైదరాబాద్లో కమ్మటి ఇరానీ చాయ్ తాగాలంటే కచ్చితంగా ‘నిలోఫర్ కేఫ్’కి వెళ్లాల్సిందే. అంతేకాదు, అక్కడ తయారు చేసే ఉస్మానియా బిస్కెట్లకూ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజాం సంస్కృతికి అద్దం పట్టేలా చాయ్ కెటిల్లోని వేడివేడి ఇరానీ చాయ్ తాగుతుంటే ఆ మజానే వేరు. ఆ అనుభూతిని కొవిడ్ భయం కారణంగా చాలామంది మిస్సవుతున్నారు. అయితే ఇప్పటివరకు బిస్కెట్లు, కేకులకు మాత్రమే ఆన్లైన్ ఆర్డర్లు తీసుకునేది నిలోఫర్ కేఫ్. కానీ చాయ్ ప్రేమికుల కోసం సరికొత్త ట్రెండ్కు నాంది పలికింది. ఆన్లైన్ కస్టమర్ల కోసం ఎకో ఫ్రెండ్లీ చాయ్ కెటిల్ని తయారు చేసి, అందులో వేడివేడి ఇరానీ చాయ్ని డెలివరీ చేస్తున్నది. ఐదు లేదా ఎనిమిది కప్పులు వచ్చేంత చాయ్ని కెటిల్లో నింపుతున్నది. దాంట్లోని చాయ్ రెండుగంటలపాటు వేడిగా ఉంటుంది. ఇంకేం, కస్టమర్లు ఇంట్లోనే కమ్మని హాట్ చాయ్ని ఆస్వాదించొచ్చు.
కుండ బిర్యానీ..
హోటళ్లలో కుండలో తీసుకొచ్చిన బిర్యానీని వడ్డించడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో కుండ బిర్యానీ మెనూలో భాగమైంది. అయితే బెంగళూరుకు చెందిన పాట్ఫుల్ అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ మాత్రం తమ కస్టమర్లకు మట్టికుండలోనే బిర్యానీని ఇళ్లకు పంపిస్తున్నది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో సేవలను అందిస్తున్నది. దానివల్ల కుండ బిర్యానీని ఇష్టపడేవాళ్లతో పాట్ఫుల్కు రోజురోజుకీ గిరాకీ పెరుగుతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా బిర్యానీని తయారు చేయిస్తున్నది కూడా. కారణం, దక్షిణాది కస్టమర్లతో పోలిస్తే ఉత్తరాది వాళ్లు తక్కువ మసాలా ఇష్టపడతారు. అందువల్లే రకరకాల బిర్యానీలను అందిస్తున్నది పాట్ఫుల్. ఇంకొన్ని చోట్ల కుండలో బిర్యానీతో పాటు కొన్నిరకాల విత్తనాలను కూడా పంపిస్తున్నది. తిన్న తర్వాత ఖాళీ కుండలో మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తున్నది.
లీఫ్ బాక్స్..
ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలు.. లాక్డౌన్ ముందు, లాక్డౌన్ తర్వాత అన్నట్టుగా ఉన్నాయి. ఒకప్పుడు రోడ్ల మీదే నచ్చిన స్ట్రీట్ ఫుడ్ను తెగ లాగించేవారు. లాక్డౌన్ తర్వాత తినాలన్న కోరిక ఉన్నా, భయంతో ధైర్యం చేయట్లేదు కొంతమంది. అలాంటి వారికోసమే న్యూఢిల్లీలో ప్రారంభమైంది భవన్ అనే స్టార్టప్. ఇక్కడ పానీపూరీ, కచోరీ, సమోసా నుంచి ఆలూ దమ్ దహీ వడ, కరేలా చాట్, పాలక్ చాట్ మొదలైన స్ట్రీట్ఫుడ్ వెరైటీలను ఆన్లైన్ డెలివరీ చేస్తున్నది భవన్. అందరిలా ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఆకులతో చేసిన బౌల్స్, బాక్సుల్లో స్నాక్స్ డెలివరీ చేస్తున్నారు. కొన్నింటిని మాత్రం అట్ట డబ్బాల్లో ప్యాక్ చేస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ వాడకం లేకుండా ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్తో కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకెళ్తున్నారు.
బార్బెక్యూ ఇన్ ఎ బాక్స్..
ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వాలన్నా, ఫ్యామిలీతో హ్యాంగవుట్ చేయాలన్నా హైదరాబాద్లో చాలామంది ఎంచుకునే రెస్టారెంట్ బార్బెక్యూ నేషన్. మరెక్కడా దొరకని వెరైటీలు అందిస్తున్నది ఈ రెస్టారెంట్. లాక్డౌన్ తర్వాత ‘బార్బెక్యూ ఇన్ ఎ బాక్స్’ పేరుతో హోమ్ డెలివరీని ప్రవేశపెట్టింది. వెజ్ లేదా నాన్వెజ్.. ఏది ఆర్డర్ చేసినా, సుమారు పదిహేను రకాల వంటలు ఆ బాక్స్లో ప్రత్యక్షమవుతాయి. దేనికి అది సెపరేట్గా ఉండేలా డిజైన్ చేసిన ప్యాకేజింగ్కు చాలామంది ఫిదా అవుతున్నారు. అట్ట డబ్బాల్లో పార్టీషన్లుగా ఉన్న ర్యాకుల్లో కట్లెట్స్, డిజెర్ట్స్, స్టార్టర్స్ని ప్యాక్ చేస్తున్నారు. అసలు, బార్బెక్యూ ఇన్ ఎ బాక్స్ ప్యాకేజీని చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇంటిల్లిపాదికీ ఈ ఒక్క బాక్స్ చక్కగా సరిపోతుందంటున్నారు నిర్వాహకులు.
ఇవీ కూడా చదవండి…