సమష్టి కృషితో పెద్దమొత్తంలో ఆస్తి పన్ను వసూళ్లు చేశాం
ప్రజల సహకారానికి కృతజ్ఞతలు – మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లు
ముగిసిన ఆర్థిక సంవత్సరం – నిండిన ఖజానా
మేడ్చల్, ఏప్రిల్ 4: ఆర్థిక సంవత్సరం ముగియటంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖజానా నిండుకున్నది. మేడ్చల్ నియోజకవర్గంలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లకు ఆస్తి పన్ను వసూలు పెద్దఎత్తున చేపట్టారు. నగరానికి చేరువలో ఉన్న ఈ మున్సిపాలిటీల్లో ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను వచ్చి చేరడంతో ఖజానా నిండుకున్నది. ఆర్థిక సంవత్సరం గడువు ముగింపు వరకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలతో ప్రజలకు అవగాహన కల్పించి పన్నును రాబట్టారు. కనీస వసతులు, మెరుగైన సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రతిఒక్కరూ ఆస్తిపన్ను కట్టాలని నచ్చజెప్పి బకాయిలను సైతం వసూలు చేయగలిగారు. ఇంకా మిగిలిన బకాయిలను వసూలు చేసే విధంగా కృషి చేస్తున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం గ్రామాలు నేడు సమీప పంచాయతీలను కలుపుకుని మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. అదేవిధంగా బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్లు కార్పొరేషన్లుగా మారాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అసెస్మెంట్ ద్వారా పెరిగిన ఆస్తి పన్నుతో కోట్ల నిధులు సమకూరాయి.
బోడుప్పల్ కార్పొరేషన్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.97 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశాం. మొత్తం (పాత బకాయిలతో సహా) రూ.11.73 కోట్ల నిధులు రావాల్సి ఉండగా రూ. 9.97 కోట్లు రాబట్టి 84.99 శాతం మేర ఆస్తి పన్ను వసూలు పూర్తి చేశాం. ఇంకా రూ.1.76 కోట్ల ఆస్తి పన్ను రావాల్సిఉంది. మరికొద్ది రోజుల్లోనే 100శాతం పన్నులు పూర్తిచేపడుతాం. వసూలైన నిధులతో అవసరం మేరకు అభివృద్ధి పనులు చేపడుతాం. – బోనగిరి శ్రీనివాస్. కమిషనర్ బోడుప్పల్ కార్పొరేషన్
మేడ్చల్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను డిమాండ్ రూ 10,21,75,000 లు ఉండ గా అందులో రూ.9, 59, 22,000లు వసూలు చేపట్టి 93.88 శాతం పూర్తి చేశాం. ప్రభుత్వం ప్రకటించిన 90 శాతం పెనాల్టీ రద్దుతో పన్ను కట్టేందుకు అత్యధికంగా ప్రజలు ముందుకు వచ్చారు. దీనికితోడు సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించి వసూలు చేశారు. వచ్చిన సొమ్మును సాధారణ ఖర్చులకు ఉపయోగించగా…మిగిలిన సొమ్మును అవసరమున్నచోట అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెచ్చిస్తాం. ప్రజా ప్రయోజనాల అవసరం మేరకు పాలకవర్గ సభ్యులతో ఆమోదంతో ప్రణాళికలు తయారు చేసి ఖర్చు చేస్తాం. – సత్యనారాయణరెడ్డి. కమిషనర్, మేడ్చల్ మున్సిపాలిటీ
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పన్నులు, పన్నేతరుల వసూళ్ల డిమాండ్ ఏరియర్స్తో కలుపుకొని రూ.8 కోట్ల 19 లక్షలు ఉండగా, రూ.8.08 కోట్ల పన్నులు వసూలయ్యాయి. వసూళ్ల శాతం 98.69గా నమోదైంది. ప్రభుత్వం రూ.10వేలు పన్నులు ఉన్న వారికి 50 శాతం మాఫీ చేయడం, చివరలో 90 శాతం పెనాల్టీని తగ్గించడంతో ప్రజలు పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సహకారంతో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలిగాం. ప్రతిరోజు సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేశారు. పన్నులు చెల్లించి, మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు.- అమరేందర్రెడ్డి, కమిషనర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లపై సమావేశాలు నిర్వహించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చాం. మొండి పద్దులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని వసూళ్లు చేశాం. నాగారం మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను రూ. 8,31,55,000 డిమాండ్ ఉండగా.. మార్చి 31 నాటికి రూ. 7,37,95000లు వసూలు చేసి 90.87 శాతం పూర్తి చేశాం. చైర్మన్ చంద్రారెడ్డి సలహాలు, సూచనలతో సిబ్బంది పనిచేశారు. ఆర్వో, ఆర్ఐ, బిల్ కలెక్టర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసి వసూలు చేశారు. అందరి సహకారంతో గతం కంటే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలయ్యాయి. – ఎ.వాణిరెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మున్సిపల్ అధికారులు, బిల్ కలెక్టర్లు మున్సిపాలిటీ పరిధిలో విస్తృత ప్రచారం చేసి పన్నులు వసూళ్లు చేశారు. గతంలో 50 శాతం ఉన్న పన్ను వసూళ్ల శాతాన్ని అధిక మొత్తంలో పెంచాం. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 8,41,24,000ల డిమాండ్ ఉండగా మార్చి 31 నాటికి రూ. 7, 83,16,000లు వసూళ్లు చేసి 93.1 శాతం పూర్తి చేశాం. సమకూరిన ఆస్తి పన్ను నిధులతో మున్సిపల్ పరిధిలోని అవసరమున్న చోట అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తాం. పాలకవర్గ ఆమోదంతో ఈ నిధుల కేటాయింపు చేపడుతాం – స్వామి, కమిషనర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ
ఘట్కేసర్ మున్సిపాలిటీలో పన్ను వసూళ్ల డిమాండ్ రూ. 3. 36 కోట్లు ఉండగా, మార్చి 31 నాటికి రూ. 3.19 కోట్లు వసూలు చేసి 96 శాతం పన్నులు పూర్తి చేశాం. ఈ నిధులతో మున్సిపాలిటీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఖర్చుచేస్తాం. సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పని చేయడంతోనే పెద్ద మొత్తంలో పన్ను వసూలయ్యాయి. సమయాన్ని చూడకుండా ప్రజలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వెళ్లి అవగాహన కల్పించి పన్నును రాబట్టారు. – వసంత, కమిషనర్, ఘట్కేసర్ మున్సిపాలిటీ
పోచారం మన్సిపాలిటీలో రూ.3,91,09, 000లు ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ. 3,52,44,000లు వసూలు చేసి 90.12 శాతం మేర పూర్తి చేశాం. సమకూరిన నిధులతో భవిష్యత్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తాం. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అందరి ఆమోదంతో పనులు చేపడుతాం. – ఏ.సురేశ్ కుమార్, కమిషనర్ పోచారం
తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను డిమాండ్ రూ.7,94,43,000లు ఉంది. మార్చి 31 నాటికి రూ. 6,91,60,000 లు వసూలు చేయగా మొత్తం 87.06 శాతం చేశాం. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవడంతో పని సులువైంది. మున్సిపాలిటీలో నిర్వహించిన వన్టైం సెటిల్మెంట్స్ మంచి ఫలితాన్నిచ్చింది. బకాయిల చెల్లింపుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మొండిబకాయిదారులకు ఎప్పటికప్పుడు నార్మల్, రెడ్ నోటీసులు జారీ చేశాం. – గంగాధర్, కమిషనర్, తూంకుంట మున్సిపాలిటీ
పీర్జాదిగూడ నగరపాలక పరిధిలో 26 డివిజన్లు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను రూ. 10.84 కోట్లకు గాను రూ.9.68 కోట్లు వసూలయ్యాయి. వంద శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నాం. కార్పొరేషన్ పరిధిలో ఆర్థిక సంవత్సరం చివరి వరకు 91 శాతం పన్నులు వసూలయ్యాయి. పీర్జాదిగూడ కార్పొరేషన్ పన్ను వసూళ్లలో అగ్రగామిగా నిలువడానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ఇంటి పన్నులు గత ఏడాది కంటే మెరుగ్గా వసూలు చేయడానికి చర్యలు తీసుకున్నాం. – బీ. శ్రీనివాస్. కమిషనర్, పీర్జాదిగూడ నగరపాలక సంస్థ
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మార్చి 31 వరకు రూ. 4,41, 21,000ల డిమాండ్ ఉంది. మార్చి 31 నాటికి రూ. 4,8,43,000ల పన్నులు వసూలు చేశాం. ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పించడంతో 92.57 శాతం వసూళ్లు అయ్యాయి. – డాక్టర్ గోపి, కమిషనర్, జవహర్నగర్ కార్పొరేషన్