జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తండ్రైన (30) కామాంధుడు ఎనిమిదేండ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటన భరత్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హిందువన్ గ్రామానికి చెందిన రాజేష్ జాదవ్ అదే గ్రామానికి చెందిన బాలిక కిరాణా సరుకులు కొనేందుకు బయటకు రాగా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇక తన నిర్వాకం బయటపడుతుందనే భయంతో బాలికను ఊపిరిఆడనివ్వకుండా చేసి చిన్నారిని చిదిమేశాడు. బాలిక మృతదేహాన్ని బావిలో పడేసి వెళ్లిపోయాడు. బాలిక కోసం కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావిలో బాలిక శవం తేలుతుండటం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముగ్గురు కుమార్తెలకు తండ్రైన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.