ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కలకలం రేపిన నిర్భయ తరహా హత్యాచార ఘటనలో నిందితుడు మోహన్ చౌహాన్ను పోలీసులు మట్టుబెట్టినా తాను కలత చెందనని ఆయన తండ్రి కత్వరు చౌహాన్ అన్నారు. తన కుమారుడిపై ఆరోపణలను తాను ఆమోదించలేకపోయినా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో మౌనం దాల్చానని పేర్కొన్నారు. చౌహాన్ యూపీలోని జాన్పూర్ జిల్లా రరికల గ్రామానికి చెందిన వారు.
నిందితుడు మోహన్ తల్లి గతంలో చనిపోగా తండ్రి గ్రామంలోని ఇంటిలో ఒక్కడే నివసిస్తున్నాడు. ఇక భార్య, పిల్లలతో పాటు నిందితుడు మోహన్ చౌహాన్ ముంబైలో ఉంటున్నాడు. ముంబైలో నిర్భయ ఘటన వార్త వినడంతో తాను తొలుత దిగ్భ్రాంతికి లోనయ్యానని నిందితుడి తండ్రి పేర్కొన్నారు. మోహన్ పుట్టగానే చనిపోయాడని తాను అనుకుంటానని చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై సకినాక ప్రాంతంలో 34 ఏండ్ల మహిళపై ఆగిఉన్న టెంపోలో నిందితుడు లైంగిక దాడికి పాల్పడి ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్తో గాయపరచడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మోహన్ చౌహాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ చౌహాన్ ను సెప్టెంబర్ 21 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించారు. హత్యాచార ఘటన కేసును విచారించేందుకు ఎస్పీ జ్యోత్స్న సారధ్యంలో ముంబై పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు.