‘కమర్షియల్ హంగుల కంటే కథకు నేను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తా. ఎంచుకునే ప్రతి సినిమా వాస్తవికతకు దగ్గరగా సహజంగా ఉండాలని కోరుకుంటా’ అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీష్ దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో శ్రీవిష్ణు చెప్పిన ముచ్చట్లివి..
తండ్రీ కొడుకుల అనుబంధానికి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ప్రమాదం వలన మాటలు కోల్పోయిన తండ్రి అనూహ్యంగా కనిపించకపోతే కొడుకు పడిన తపన ఏమిటి? విపత్కర పరిస్థితుల నుంచి తండ్రి ఎలా బయటపడ్డాడనేది ఉత్కంఠను పంచుతుంది. వినూత్నమైన పాయింట్తో స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. ఈ సినిమాలో జులాయిగా తిరిగే తండ్రిగా రాజేంద్రప్రసాద్, బాధ్యతాయుతమైన కొడుకుగా నేను కనిపిస్తాం. మా పాత్రల మధ్య నెలకొనే సంఘర్షణ నుంచి చక్కటి వినోదం పుడుతుంది. మా పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది.
ఈ సినిమాలో నా తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించారు. షూటింగ్ సమయంలో తనకున్న సుదీర్ఘ నటనానుభవంతో ఆయన నాకు చక్కటి సలహాలు ఇచ్చారు. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ సింగిల్ టేక్లోనే పూర్తయ్యాయి.
కథల విషయంలో మొహమాటపడను. దర్శకుడు చెప్పిన కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తా. నాకు సెట్ కాకపోయినా ఆ విషయాన్ని దర్శకులకు వివరిస్తుంటా. అలా నేను వదులుకున్న సినిమాలు విజయవంతమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ‘రాజరాజచోళ’, ‘అర్జున ఫాల్గుణ’తో పాటు పోలీస్ ఆఫీసర్ బయోపిక్లో నటిస్తున్నా.