హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసింది. దీంతో ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జనజీవనం కొనసాగిస్తున్నారు. క్రమంగా ప్రజా రవాణా సౌకర్యాలు కూడా మెరుగవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల కూడా ప్రారంభమయ్యాయి. అయితే దూర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉంటున్నది. దీంతో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇందులో విశాఖపట్నం-కాచిగూడ (08561)ను జూలై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలు (08562)ను జూలై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా విశాఖపట్నం-లింగంపల్లి రైలు (02831)ను జూలై 1 నుంచి 14వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు. లింగంపల్లి-విశాఖపట్నం రైలు (02832)ను జూలై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, ప్రయాణికుల సౌకర్యం కోసం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో సికింద్రాబాద్-అగర్తల రైలు (07030) వచ్చేనెల 5, 12న, అగర్తల-సికింద్రాబాద్ రైలు (07029) జూలై 9, 16న బయల్దేరుతుందన్నారు. అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్ రైలు (02524) జూలై 6 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం, బెంగళూరు కంటోన్మెంట్-అగర్తల రైలు (02523) జూలై 9 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుందని చెప్పారు.