సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల్లోని అగ్రికల్చర్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి.. విద్యార్థులను మోసం చేస్తున్న ఓ నకిలీ కన్సల్టెంట్ నిర్వాహకుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లాకు చెందిన మోట్ల సీన అభినయ్ నాయక్.. గతంలో అపెక్స్ కన్సల్టెన్సీలో పనిచేశాడు.
ఈ కన్సల్టెన్సీ మెడికల్, బీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ సీట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి భారీ మోసం చేసింది. దీనిపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కన్సల్టెన్సీ మోసం ఘటనలో అరస్టైన అభినయ్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తానే సొంతంగా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరుతో బంజారాహిల్స్లోని కృష్ణానగర్లో నకిలీ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు.
సుమారు 15 మంది విద్యార్థుల నుంచి రూ. 37.55 లక్షలు వసూలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు పరారీలో ఉండటంతో రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం.. ఈ నకిలీ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి కారు, సెల్ఫోన్, తదితర వస్తువులు స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకుడి నుంచి మోసపోయిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలుంటాయని పోలీసులు భావిస్తున్నారు.