లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ కుమారుడు కవి అహ్మద్పై పోలీసులు లైంగిక దాడి, దోపిడీ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిందితుడు పేరు మార్చుకుని పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మహిళకు దగ్గరయ్యాడు.
మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే భార్య, కూతురు కూడా తనను వేధింపులకు గురిచేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన తాను సివిల్లైన్స్లో జిమ్ నిర్వహిస్తున్నానని బాధితురాలు వివరించారు. 2018లో కవి అహ్మద్ తన పేరు మార్చుకుని తనతో స్నేహం చేశాడని, బ్యూటీపార్లర్ నడిపిద్దామని చెబుతూ తనను లక్నోకు తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లగానే మత్తుమందు ఇచ్చి తనను లైంగికంగా వేధించేవాడని, తన అభ్యంతరకర వీడియోలు తీసి వాటిని చూపుతూ బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించారు.
తాను ప్రయాగరాజ్ వెళ్లినా అక్కడకు వచ్చిన నిందితుడు తనను తుపాకీతో భయపెట్టి లైంగిక దాడికి పాల్పడి వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఇక ఆదివారం తాను సివిల్లైన్స్కు వెళ్లగా నిందితుడు తన అనుచరుడితో అడ్డగించి తన గోల్డ్ చైన్ను దొంగిలించాడని, తన సిమ్ కార్డును లాక్కున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అహ్మద్పై లైంగిక దాడి, లూటీ ఆరోపణలపై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు.
మరోవైపు బ్లూటీ పార్లర్ నడిపేందుకు ఇచ్చిన రూ ఆరు లక్షలు తిరిగి ఇవ్వాలని తన కుమారుడు కోరడంతోనే యువతి తప్పుడు కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్బలంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెచ్చారని అన్నారు.