బెంగళూర్ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను కిడ్నాప్ చేసి తల్లితండ్రులను రూ 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లను బెంగళూర్ పోలీసులు ఏడు గంటల్లోపే పట్టుకుని యువకుడిని కాపాడారు. ఈనెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని శివరామయ్య లేఅవుట్, హెచ్బీఆర్ లేఅవుట్ బ్లాక్ త్రీలో రబీజ్ అరాఫత్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ను తన నివాసం నుంచి కిడ్నాపర్లు అపహరించారు. ఆపై రబీజ్ తండ్రి అరీఫుల్లాను రూ రెండు కోట్లు చెల్లించాలని ఫోన్లో డిమాండ్ చేశారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే రబీజ్ కాళ్లు, చేతులు నరికివేస్తామని హెచ్చరించారు.
రబీజ్ తండ్రి పలు కళాశాలలు నడుపుతూ మూడు దశాబ్ధాల నుంచి హెచ్బీఆర్ లేఅవుట్లో స్ధిరపడ్డారు. రబీజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి బాధితుడు, నిందితుడి మొబైల్ను ట్రాక్ చేసే పనిని సాంకేతిక బృందానికి అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెండు బృందాలు అనుమానితులను వెంటాడాయి. ఇక పోలీసులు సూచించిన విధంగా కిడ్నాపర్లు కోరిన మొత్తాన్ని ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ క్రమంలో అనుమానితుడి ఇంటిని గుర్తించిన పోలీసులు లోపలికి ప్రవేశించి కిడ్నాపర్లను అరెస్ట్ చేసి యువకుడిని కాపాడారు.