జకర్తా : తూర్పు ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 23 మంది మృతి చెందినట్లు సమాచారం. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత కొండల నుంచి పెద్ద ఎత్తున బురద జారడంతో తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలోని లామెనెలే గ్రామంలో దాదాపు 50 ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు 20 మృతదేహాలను గుర్తించగా.. తొమ్మిది మంది గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు.
ఓయాంగ్ బయాంగ్ గ్రామంలో వరదలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామస్తులలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో గ్రామమైన వైబురక్లో రాత్రిపూట కురిసిన వర్షాలకు నదులు ఒడ్డును చీల్చుకుని తూర్పు ఫ్లోర్స్ జిల్లాలోని ప్రాంతాలకు బురదనీరు ప్రవహించడంతో ఇద్దరు గాయపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వందలాది మంది ప్రజలు మునిగిపోయిన ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వారిలో కొందరు వరదలకు కొట్టుకుపోయినట్లు సమాచారం.
వందలాది మంది ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విద్యుత్ కోతలు, విరిగిపోయిన రోడ్లు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన జలాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులకు ఇబ్బందిగా ఉన్నది.
విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు, సైనిక సిబ్బంది ముంపు గ్రామాల ప్రజలను ఆశ్రయాలకు తరలిస్తున్నారు.పొరుగున ఉన్న ప్రావిన్స్ వెస్ట్ నుసా తెంగ్గారాలోని బీమాలో కూడా తీవ్రమైన వరదలు సంభవించాయి. ఇక్కడ దాదాపు 10,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని రాదిత్య జాతి తెలిపారు.
కాలానుగుణ వర్షాలు ఇండోనేషియాలో ప్రతి ఏటా కొండచరియలు, వరదలకు కారణమవుతున్నాయి. 17,000 ద్వీపాల గొలుసుకట్టుగా ఉండే ఇండోనేషియాలో మిలియన్ల మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో లేదా సారవంతమైన వరద మైదానాలకు సమీపంలో నివసిస్తున్నారు. పశ్చిమ జావా ప్రావిన్స్లో జనవరిలో రెండు కొండచరియలు విరిగిపడి 40 మంది మరణించారు.
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..