మేడ్చల్ మల్కాజ్గిరి : ఎనిమిది సభ్యుల దోపిడి దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. నిందితులను యూసఫ్గూడకు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్ కె. వినయ్(22), బంజారాహిల్స్కు చెందిన పెయింటర్ ఎస్. మహేశ్ కుమార్(19), జీడిమెట్లకు చెందిన వైన్షాప్ వర్కర్ కె. మణిదీప్, వీరేశ్, రాకేశ్, విజయ్, దీలిప్, కిరణ్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు రెసిడెన్షియల్ కాలనీలో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్స్ను అపహరించుకుపోతారు. మొత్తం 10 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. ఇటీవలే బాచుపల్లిలోని గండిమైసమ్మ ఏరియా బౌరంపేటకు చెందిన ఓ యువకుడిని ఇలాగే బెదిరించి దోపీడీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా దోపిడీ ముఠా పట్టుబడింది.