గుడిహత్నూర్ : అటవీ శాఖలో ఉన్నత స్థాయి అధికారులమని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాళ్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. సోమవారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పర్చే మోహన్ అనే యువకుడు డిగ్రీ ఫెయిలై పెయింటర్గా పని చేసేవాడు. గత రెండు సంవత్సరాలుగా ఐఎఫ్ఎస్ అధికారినంటూ నిరుద్యోగులకు అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రెండు సంవత్సరాలుగా పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని తెలిపారు. వీరికి ఫారెస్టు బీట్ ఆఫీసర్లుగా,ఫారెస్టు సెక్షన్ అధికారులుగా నకిలీ నియామక పత్రాలను అందజేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 4 లక్షల చొప్పున వసూలు చేశారని వెల్లడించారు.
నకిలీ నియామక పత్రాలు పొందిన యువకులు ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా అవి నకిలీ నియామక పత్రాలని తెలియడంతో గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఆరుగురు యువకులు గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనకు నిర్మల్లో జిరాక్స్ సెంటర్ నిర్వహించే సేర్ల నర్సయ్య అనే వ్యక్తి నకిలీ ధృవ పత్రాలు, నియామక పత్రాలను ముద్రించి ఇవ్వడంలో సహకరించాడని వెల్లడించారు. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న వీరందరినీ ఆదివారం గుడిహత్నూర్లో అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని ఎస్పీ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి మూడు లక్షల నగదుతోపాటు నకిలీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు, కంప్యూటర్, సీపీయూ, ప్రింటర్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఉన్నత చదువులు చదవాల్సి ఉంటుందని, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని సంప్రదిస్తే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో గాని 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇచ్చోడ సీఐ రమేశ్బాబు, ఎస్ఐ ఎల్ ప్రవీణ్ను ఎస్పీ అభినందించారు. శిక్షణ ఎస్ఐ బుద్దే మల్లేశ్,ఏఎస్ఐ రమేశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.