జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7: అడవులను కాపాడుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. అడవులను కాపాడడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలో అత్యంత సుందరంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనంతో పాటు, కంపోస్ట్ షెడ్డు, వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేశ్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ, జిల్లాలో ప్రతి గ్రామం ఆదర్శంగా ఉండేలా ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాటుపడాలని పిలుపునిచ్చారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అడవులు ధ్వంసం కాగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం, పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పచ్చదనాన్ని పెంపొందిస్తున్నదన్నారు. హబ్సీపూర్ పల్లె ప్రకృతి వనం మోడల్గా ప్రతి గ్రామంలో తీర్చిదిద్దాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, గ్రామాల్లో ఏప్రిల్ 15 వ తేదీలోగా పల్లె ప్రకృతి వనాలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని అన్నారు. పెరకపల్లి గ్రామంలో పెరక సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలోని దుర్గా థియేటర్ యజమాని, వ్యాపారవేత్త గొల్లపల్లి రాజాగౌడ్ సతీమణి, ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ గౌడ్ తల్లి సుశీల అనారోగ్యంతో మృతి చెందింది.
వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సందీప్రావు, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, మాజీ ఎంపీపీ ఎల్లారెడ్డి, కౌన్సిలర్ నారాయణ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెరుకు జాన్, మోహన్ రెడ్డి, తిరుపతి, సుధాకర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.