గురుగ్రాం : మద్యం మత్తులో ఆకతాయిలు పేట్రేగుతున్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఇద్దరు మహిళల పట్ల తాగుబోతులు అసభ్యంగా వ్యవహరించిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది. గురుగ్రాం-ఫరీదాబాద్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న మహిళకు తన తండ్రి ఫోన్ చేసి ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఆమె తన కొలీగ్తో కలిసి ఇంటికి బయలుదేరింది.
వారు క్యాబ్ కోసం మెయిన్ రోడ్డుకు చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళలను అడ్డగించారు. వారి మొబైల్ నెంబర్లు ఇవ్వాలని లేకుంటే లైంగిక దాడికి పాల్పడి యాసిడ్ పోస్తామని బెదిరిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వ్యవహారాన్ని ఓ మహిళ సోషల్ మీడియాలో స్ట్రీమ్ చేయగా మరొకరు పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. ఇక క్యాబ్లో ఎక్కిన తర్వాత కూడా కారును కదలనీయకుండా నిందితులు అడ్డగించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.