అహ్మదాబాద్: మద్యం తాగిన గేదెలు, అక్రమ లిక్కర్ అమ్మకాల గుట్టును అధికారులకు రట్టుచేశాయి. ఈ వింత ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ముగ్గురు రైతులు అక్రమంగా సారా అమ్ముతున్నారు. లిక్కర్ సీసాలను గేదెలు తాగే నీటి తొట్టిలో దాచారు. అయితే కొన్ని సీసాలు పగలడంతో సారా నీటిలో కలిసింది. ఈ నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించాయి.
గేదెల వింత ప్రవర్తనకు ఆందోళన చెందిన ఒక రైతు పశు వైద్యుడ్ని రప్పించాడు. గేదెలు తాగిన నీటి వాసన, రంగును పరిశీలించిన ఆ పశువైద్యుడు అందులో మద్యం కలిసినట్లు గుర్తించాడు. అక్రమ సారా అమ్మకాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సోమవారం ఆ పశుశాలపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ రహస్యంగా దాచిన రూ.32,000 విలువైన వంద మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రైతులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.