హైదరాబాద్ : కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాల లభ్యత, ఎరువులు, ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద చర్చించారు.
జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలన్నారు. కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలన్నారు. ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీలతో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
ఈ మేరకు తక్షణమే జిల్లాల వారీగా పోలీసులను రంగంలోకి దించాలని డీజీపీని ఫోన్లో సీఎం ఆదేశించారు.నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సీఎం ఆదేశించారు. విత్తనాలనే కాకుండా ఫెర్టిలైజర్లు కూడా కల్తీ కావడం దుర్మార్గం. బయో ఫెస్టిసైడ్ల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను కూడా పట్టుకోని పీడి యాక్టు పెట్టాలె అని సీఎం తెలిపారు.