చార్మినార్ : ఒకటి కాదు.. రెండు కాదు నాలుగు సార్లు నగర పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించినా తన ప్రవర్తనలో మార్పులేదు. మరింతగా రాటుదేలుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న మంత్రి శంకర్ను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన శివన్న అలియాస్ మంత్రి శంకర్ 43 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ 22 సార్లు జైలు జీవితాన్ని గడిపాడు. కన్నువేశాడంటే అంతే ఆ ఇంట్లో చోరీ జరగాల్సిందేన్నట్లుగా శంకర్ చోరీలకు పాల్పడేవాడు.
నగరంతోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషరేట్ల పరిధిల్లోనూ చోరీలకు పాల్పడిన శంకర్ను పలు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇప్పటి వరకు 22 సార్లు జైలు కెళ్లినా మంత్రి శంకర్ అర్థరాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 4 గంటల సమయంలోపే చోరీలకు పాల్పడేవాడు.
గత డిసెంబర్ 14 న జైలు నుండి బయటకు వచ్చిన శంకర్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ అసద్, సయ్యద్ మెహ్రాజ్, అంబర్పేట్ ప్రాంతానికి చెందిన మహమద్ మోయిజ్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. నగరంలో చోరీలు చేయడానికి రెక్కీలు నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు మంత్రి శంకర్ ఇంటిపై దాడులు నిర్వహించారు.
దాడుల్లో మంత్రి శంకర్తోపాటు మరో ముగ్గురు సభ్యులను సైతం అందుపులోకి తీసుకున్నామని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపారు. నిందితుల తదుపరి విచారణ నిమిత్తం సైదబాద్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్సైలు శ్రీశైలం, తఖీయుద్దీన్, చంద్రమోహన్, నరేంధర్,ప్రతాప్రెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.