–ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
బడంగ్పేట : ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ మండల తాసీల్ధార్ డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి సర్వే నెంబర్ 223లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో తాసీల్ధార్ డి డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఆర్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. 15 ఇండ్లు, 20 ప్రహారీ గోడలు అక్రమంగా నిర్మాణం చేయడంతో వాటిని కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన అన్నారు. ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఆయన అన్నారు.
గతంలో చాలా మంది కబ్జా దారులపై క్రిమినల్ కేసులు నడుస్తున్నాయన్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కొల్లగొట్టడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపిచారు. కబ్జా దారులు ఎంతటి వారైనా సహించేది లేదన్నారు. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని తాసీల్ధార్ అన్నారు. ప్రభుత్వ భూములకు బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నామని అయితే ఆ బోర్డులను గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయిస్తామన్నారు.
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మరో సారి సర్వే చేయించి బోర్డులు ఏర్పాటు చేయిస్తాని స్పష్టం చేశారు. కబ్జా దారుల పై కేసులు నమోదు చేసి జైలుకు పంపినా వారు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, పైగా తమ సిబ్బందిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోన వ్యక్తం చేశారు. ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తిరిగి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.