న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కలకలం రేపిన దళిత బాలిక(9) హత్యాచార కేసులో బాధిత కుటుంబ సభ్యులు, కీలక సాక్షులకు భద్రత కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు ప్రధాన సాక్షులకు భద్రత కల్పించాలని ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఇక దళిత బాలిక హత్యాచార కేసులో అరెస్టయిన నిందితులను ఢిల్లీ కోర్టు సోమవారం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించింది. నిందితులను ఐదు రోజుల రిమాండ్కు అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.
మరోవైపు ఢిల్లీ పోలీసుల నుంచి తమకు ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని బాధిత కుటుంబం తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు దయనీయంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసును క్రైమ్ బ్రాంచ్కు తరలించారని దర్యాప్తు నిజాయితీగా స్వేచ్ఛగా సాగుతుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు.
బాధిత కుటుంబ సభ్యులకు, సాక్షులకు తొలుత భద్రత కల్పించాలనేది తమ డిమాండ్ అని దీనికోసం ఏ వేదికనైనా ఆశ్రయిస్తామని న్యాయవాది స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులను ఇటీవల పరామర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ పదిలక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.