న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకుని రెండేండ్ల క్రితం నేలకు పరిమితమైన ప్రైవేట్ ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్ విమానాలు త్వరలో టేకాఫ్ తీసుకోనున్నాయి. ఈ మేరకు జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసేందుకు కల్రాక్-జలాన్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది.
అయితే దీనికి ఎన్సీఎల్టీ కొన్ని షరతులు విధించింది. ఈ విమానయాన సంస్థ సేవల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపునకు కేంద్ర పౌర విమాన యాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు ఎన్సీఎల్టీ మూడు నెలల గడువు పెట్టింది.
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్ల బకాయిలను వచ్చే ఐదేండ్లలో చెల్లిస్తామని రుణ పరిష్కార ప్రణాళికలో కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది.
ప్రారంభంలో 30 విమానాలతో జెట్ ఎయిర్వేస్ సేవలను పునరుద్ధరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కల్రాక్-జలాన్ కన్సార్టియం వెల్లడించింది. రుణాల ఊబిలో చిక్కుకోవడంతో జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్లో మూత పడింది. ఏయే రూట్లలో విమానాలు తిరుగుతాయో నిర్ణయించాల్సి ఉంది.
దివాలా చట్టం కింద ప్రస్తుతం ఈ రుణ బకాయిల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ప్రణాళికకు అనుగుణంగా బిడ్లు దాఖలు చేసిన వారికి జెట్ ఎయిర్వేస్ అప్పగిస్తామని బ్యాంకర్ల కన్సార్టియం తెలిపింది.
ఈ నేపథ్యంలో బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్ల నేతృత్వంలోని కన్సార్టియం 2020 అక్టోబర్లో జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్ను గెలుచుకున్నది.
అనంతరం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలిపింది. చివరిగా ఆమోదం కోసం వచ్చిన ఈ రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.