చాంద్రాయణగుట్ట : నగరంలో తరుచూ ఎక్కడో ఓ చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి పై లైంగికదాడి చేసి హత్య చేసిన కామాంధుడి కథ నడుస్తుండగానే పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి వరస అయ్యే వ్యక్తి ఓ మైనర్ బాలికను భయపెట్టి మూడేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..గౌస్ నగర్లో నివసించే ఓ మహిళకు ఇద్దరు కుమారులు, పద్నాలుగు ఏండ్ల వయస్సు కలిగిన ఓ కూతురు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇండ్లలో పాచిపని చేస్తూ పిల్లల పోషణ కొనసాగిస్తుంది.ఈ క్రమంలో అంబర్పేటకు చెందిన ఓ పాన్షాపు వ్యాపారి షరీఫ్ యూసుఫ్ (45) పరిచయం అయ్యాడు.ఆయనకు అప్పటికే భార్యా పిల్లలు ఉన్నారు. ఐనప్పటికీ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తరుచూ గౌస్ నగర్కు వచ్చి పోయే వాడు.
ఈ క్రమంలో రెండో భార్య పనికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న వరుసకు కూతురు అయ్యే బాలికపై లైగింకదాడి చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎవరికైనా చెప్తే మీ అమ్మతో పాటు నిన్ను కూడా చంపేస్తాను అంటూ బెదిరిస్తూ మూడేండ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇటివలే భార్య ఇంటికి వచ్చే సరికి కూతురుపై లైంగికదాడి చేస్తూ కనిపించే సరికి ఆ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపారు.కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.