లండన్: రాజకీయ నాయకులు తమకు ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పి తప్పించుకుంటారు. తర్వాతెప్పుడో ఆ సంగతి రుజువైతే క్షమాపణలు చెప్పుకుని జారుకుంటారు. అలా కాకుండా రాజకీయ నాయకులు బుద్ధి పూర్వకంగా అబద్ధం చెప్పడాన్ని శిక్షార్హమైన నేరంగా చట్టం చేయాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రజల్లో అత్యధికులు సమర్థించారు. బ్రిటన్లో ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 76 శాతం మంది ఓటు వేశారు.
వీరిలో రాజకీయ భావజాల పరంగా తేడాలు కనిపించాయి. లిబరల్ డెమొక్రాట్లలో 72 శాతం మంది ఈ ప్రతిపాదనను సమర్థించగా లేబర్ పార్టీ అనుయాయుల్లో 84 శాతం, కన్సర్వేటివ్ పార్టీ సమర్థకుల్లో 75 శాతం మంది ఓకే చెప్పారు. 2,002 మందితో ఒపీనియమ్ సంస్థ ఆన్ లైన్ లో ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న మూడు శాతం మంది మాత్రమే ప్రతిపాదనను వ్యతిరేకించారు. రాజకీయ నాయకులు సాధారణంగా నిజాలే చెపుతారని నమ్మేవారూ 3 శాతం కావడం గమనార్హం.
అయితే రాజకీయ నాయకులు ఎప్పుడూ నిజాలు చెప్పరని ప్రతి నలుగురిలో ఒకరు అంటే 25 శాతం మంది నమ్ముతున్నారు. కంపాషన్ ఇన్ పాలిటిక్స్ అనే సంస్థ ఈ సర్వేను జరిపించింది. సంస్థ కోడైరెక్టర్ జెన్నిఫర్ నాదెల్ మాట్లాడుతూ.. ‘దేశంలోని ఇతర పనిప్రదేశాలా లేదా వ్యాపారాలకు భిన్నంగా పనిచేసేందుకు పార్లమెంటును ఎలా అనుమతించగలం అని ప్రశ్నించారు. ఒక కంపెనీ ఏదైనా ఉత్పత్తిని అమ్మి దాని గురించి అబద్ధాలు చెప్తే పరిహారం పొందే హక్కు మనకు ఉంటుంది. రాజకీయాల్లో కూడా అలాగే ఉండాలి కదా. ఎవరైనా రాజకీయ నేత తన విజయాల గురించి, భావాల గురించి, చర్యల గురించి కావాలని అబద్ధం చెప్తే అందుకు తగిన మూల్యం చెల్లించాలి. ఈ విధానంలో రాజకీయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తిరిగి నెలకొల్పగలం’ అని ఆమె పేర్కొన్నారు.
వెల్ష్ జాతీయవాద పార్టీ ప్లెయిడ్ సిమ్రూ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ ఏడాది ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని వారు భావిస్తున్నారు. ఈ నేరానికి అపరిమితమైన జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మద్దతు లేకుండా ఈ చట్టం ప్రాణం పోసుకుంటుందని భావించలేము. “ప్రజాస్వామ్యానికి జవాబుదారీతనమే ప్రాణం. ప్రభుత్వంలో నమ్మకానికి ఇదే పునాది”అని ప్లెయిడ్ పార్లమెంటరీ పార్టీ నేత లిజ్ సావిల్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అలాంటి గ్యారంటీలు ఏమీ లేవు. ఎందుకంటే రాజకీయులు రొటీన్గా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారు. కానీ ప్రజలు మాత్రం వారు నిజాలు చెప్పాలని గట్టిగా నమ్ముతారని లిజ్ అన్నారు.