బెంగళూర్ : సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఖాతాల్లో సొమ్మును నేరగాళ్లు క్షణాల్లో మాయం చేస్తున్నారు. నకిలీ లాటరీ టికెట్లతో బెంగళూరుకు చెందిన 37 ఏండ్ల మహిళను సైబర్ నేరగాళ్లు రూ 5 లక్షలకు టోకరా ఇచ్చారు. బాధిత మహిళను నకిలీ లక్కీ డ్రా లెటర్స్ తో నిందితులు బోల్తా కొట్టించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అమిత్ కుమార్, లుఫ్తార్ అలీ ఘజీ, గంగా పాశ్వాన్, జానకి దేవి ఝా గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలికి ఫిబ్రవరి 4న ఆమె లాటరీలో భారీ నగదు బహుమతి పొందడంతో పాటు లక్కీ డ్రాలో స్క్రాచ్ కార్డులు గెలుచుకున్నారని లేఖ వచ్చింది. లేఖలో ఉన్న నెంబర్ కు ఆమె కాల్ చేయగా నిందితులు జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు ఇతర చార్జీల పేరుతో రూ 5,04,972 నగదును వారి ఖాతాల్లో జమ చేయించుకున్నారు. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసిన బెంగళూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.