న్యూఢిల్లీ : డ్రగ్స్ దందాపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపినా వారి కండ్లుకప్పి డ్రగ్స్ మాఫియా చెలరేగుతోంది. గత ఆరు నెలల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఏ)లో రూ 600 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య 14 కేసులకు సంబంధించి18 మంది విదేశీయులు, ఇద్దరు భారతీయులు సహా 20 మంది నిందితులను డ్రగ్స్ రాకెట్లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఈ కేసుల్లో అంతర్జాతీయ మార్కెట్లో రూ 600 కోట్లకు పైగా విలువైన 86 కిలోల హెరాయిన్ను సీజ్ చేశారు. ఇక పట్టుబడిన 20 మంది విదేశీయుల్లో ఆరుగురు ఆప్ఘన్ జాతీయులు కాగా, 12 మంది ఉగాండా, జాంబియా, కెన్యా, టాంజానియా, మలావి, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఐజీఐ విమానాశ్రయంలో నిఘాను పెంచిన క్రమంలో నిందితులు కస్టమ్స్ అధికారుల కంటపడ్డారని ఎయిర్పోర్ట్లో ఈ స్ధాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని ఐజీఐ విమానాశ్రయం ఇన్చార్జ్ వెల్లడించారు.