బొంరాస్పేట : బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రెండుచోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 41 మందికి గాయాలు కాగా నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. మండలంలోని మహాంతిపూర్ గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్నవోని లాలయ్యకు కాకరవేణి వాగు అవతల పొలం ఉంది. ఆదివారం వాగు నిండుగా ప్రవహించడంతో వేరుశనగ విత్తనాలు వేయడానికి విత్తనాలు, ఎరువులు తీసుకుని భార్య అమృతమ్మ, కొడుకు మణికంఠ (4), సమీప బంధువు వెంకటయ్య కలిసి కొత్తూరు, బొంరాస్పేట మీదుగా పొలానికి ట్రాక్టర్లో బయలు దేరారు. మహాంతిపూర్ గ్రామం దాటిన తరువాత మలుపులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాలీకింద ఇరుక్కున్న వెంకటయ్య, అమృతమ్మ, మణికంఠను చుట్టుపక్కల పొలాల వారు వెలికితీసి కొడంగల్ దవాఖానకు తరలించారు.
తీవ్ర గాయాలైన మణికంఠను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అదే విధంగా 163వ నంబరు జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి బోల్తాపడిన మరో సంఘటనలో 38మందికి గాయాలయ్యాయి. ఎస్ఐ ప్రియాంకరెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగుల్మడ్క, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన కొంతమంది వికారాబాద్ మండలం ఎన్నెపల్లిలో జరిగే శ్రీమంతానికి టీఎస్ 06యూడి 1200 మహేంద్రా గూడ్స్ వాహనంలో బయలుదేరారు. చిన్న, పెద్దలు కలిపి వాహనంలో 40మంది ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం బొంరాస్పేట మండలంలోని లింగన్పల్లి గ్రామ స్టేజీ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వాహనంలోని 38 మందికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రత్యేక వాహనాల్లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడ్డ వారికి చికిత్సను అందించి మెరుగైన చికిత్స కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్, హైదరాబాద్కు తరలించినట్లు వైద్యులు డా. శ్రావణి తెలిపారు. లింగన్పల్లి సర్పంచ్ కాశప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.