పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన ద్యావరి వీరారెడ్డి దంపతుల పెద్ద కుమార్తే ద్యావరి జ్యోతి(34)ని యాలాల మండలం బాగాయిపల్లికి చెందిన హన్మంత్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల మంబాపూర్లో వీరారెడ్డి తల్లి మరణించారు. కాగా గురువారం నాయనమ్మ దినాలకు జ్యోతి, భర్త హన్మంత్రెడ్డితో కలిసి వచ్చింది. శుక్రవారం తిరుగి వెళ్తుండగా మంబాపూర్ రైస్ మిల్ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో జ్యోతి కింద పడింది.
ఆమెకు తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆమెను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో మంబాపూర్ గ్రామంలో వీరారెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతురాలు జ్యోతికి ఓ కూతురు, కుమారుడు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.