bank fraud | ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగ సమయంలో కంపెనీ ఇచ్చిన క్రెడిట్ కార్డును, చెక్కులను కంపెనీకి సరెండర్ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఉపయోగించాడు. 20 రోజుల్లో స్నేహితుడితో కలిసి రూ.7 కోట్లు గోవాలో ఖర్చుచేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మెహన్ కోటిలింగం ఉద్దండ హైదరాబాద్ చందానగర్లో నివాసముంటూ 2011 నుంచి జనవరి 2021 వరకు ఇన్విస్కో హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాడు. ఆ సమయంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకు క్రెడిట్ కార్డును రూ.5 లక్షల లిమిట్తో కంపెనీ ఇచ్చింది. అవసరాలకు వాడుకొని సంబంధిత చెల్లింపులు కార్డుదారుడే చేయాలనే నిబంధనను పెట్టారు. ఈ క్రమంలో 2021, ఫిబ్రవరిలో ఈమెయిల్ ద్వారా కంపెనీకి తన రాజీనామాను పంపించి, ల్యాప్టాప్, ఐడీలు తదితర వస్తువులను కంపెనీకి సరెండర్ చేశాడు.
అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్కు సంబంధించిన కార్డును, 14 చెక్కులను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చెక్కులను ఉపయోగించి కార్డు లిమిట్ను పెంచుకున్నాడు. అతడు ఇచ్చిన చెక్కులు పాస్ కాకుండానే బ్యాంకు అధికారులు కూడా కార్డు లిమిట్ను పెంచేశారు. తన కార్డు లిమిట్ లక్షల్లో పెరిగిపోయింది. వాడగానే చెక్కును పంపించడం అవి క్లైయిమ్ కాకముందే క్రెడిట్ కార్డు లిమిట్ పెరగడంతో పాటు, కార్డుకు సంబంధించిన చెల్లింపులు జరిగినట్లు బ్యాంకుకు చెక్కులు ఇచ్చాడు. కోల్కత్తా నుంచి ఈ చెక్కులు బ్యాంకులకు అందించాడు.
స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన నిందితుడు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో రూ.7.35 కోట్లు కార్డు ద్వారా వాడాడు. చెక్కులన్నీ క్లియెరెన్స్కు రావడంతో అవి బౌన్స్ అయ్యాయి. ఆరా తీయడంతో సదరు వ్యక్తి తమ కంపెనీ నుంచి రాజీనామా చేశాడంటూ బ్యాంకు అధికారులకు వెల్లడించారు. దీంతో ఒక పథకం ప్రకారం కోటిలింగం బ్యాంకును మోసం చేసినట్లు గుర్తించిన అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గోవాకు వెళ్లిన అతడి స్నేహితులను కూడా పట్టుకుంటే ఈ స్కామ్లో ఏమి జరిగిందనే విషయంపై మరిన్ని వివరాలు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.