కోల్కతా: ఒక కరోనా రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్లో ఈ ఘటన జరిగింది. 56 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా రిపోర్ట్ రావడంతో ఈ నెల 22న సాల్బోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన తన బెడ్పై కనిపించలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆ వ్యక్తి కోసం వెదుకుతుండగా ఇంతలో భవనం పైనుంచి ఎవరో పడినట్లు పెద్ద శబ్ధం వచ్చింది. వెళ్లి చూడగా రక్తం మడుగుల్లో ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఆ వ్యక్తి నాలుగో అంతస్తులోని కిటికీ అద్దం పగులకొట్టి రూఫ్పైకి చేరినట్లు తెలుస్తున్నది. అయితే ఇంత జరుగుతున్నా అతడ్ని ఎవరూ గమనించకపోవడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. కాగా, ఆయన కొన్ని రోజులుగా ఆసుపత్రిలో అటు ఇటు తిరుగుతున్నాడని సిబ్బంది తెలిపారు. కరోనా రోగి మరణం గురించి బంధువులకు సమాచారం అందించిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.