లక్నో: ఒక యువ జంటను కొందరు ఢిల్లీలో కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్లో హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను వేరే రాష్ట్రాల్లో పడేశారు. క్రైమ్ సీరియల్ను తలపించేలా ఉన్న ఈ భయానక ఘటన ఇటీవల వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్పూర్కు చెందిన మేజర్ యువకుడు, పొరుగున ఉండే మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో జూలై 31న ఇద్దరు కలిసి పారిపోయారు.
ఇరు కుటుంబాలు ఆ ఇద్దరి కోసం వెతికారు. చివరకు ఆ జంట ఢిల్లీలో ఉన్నట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలుసుకుని అక్కడకు వెళ్లి వారిని కిడ్నాప్ చేశారు. ఆ జంటను జీప్లో మధ్యప్రదేశ్లోని భింద్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్వాలియర్కు తీసుకెళ్తూ మార్గమధ్యలో యువకుడిపై కత్తితో దాడి చేశారు. అతడి ప్రైవేట్ బాగాలు, ఇతర అవయవాలను కోసి దారుణంగా హత్య చేశారు. అతడి మృతదేహాన్ని అత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాన్సీ హైవే పక్కన పడేశారు.
అనంతరం బాలిక గొంతుకు ప్లాస్టిక్ తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. రాజస్థాన్ ధోల్పూర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పడేయడంతో అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 5న యువకుడి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ కుమారుడు కనిపించకపోవడంపై యువకుడి తండ్రి ఆగస్ట్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూపీకి చెందిన ఈ జంట హత్యకు గురైనట్లు పోలీసులకు తెలిసింది.
ఇద్దరూ కాస్త ఒకే ఈడు వారు కావడంతో వీరి హత్యలకు ఏదో సంబంధం ఉండి ఉంటుందని యూపీ పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు జరిపారు. బాలిక కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె కుటుంబ సభ్యులు తొలుత ఢిల్లీకి, తర్వాత మధ్యప్రదేశ్లోని భింద్, గ్వాలియర్, అనంతరం రాజస్థాన్లోని ధోల్పూర్కు వెళ్లినట్లు వారి మొబైల్ లొకేషన్స్ ద్వారా తెలుసుకున్నారు.
దీంతో బాలిక కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించగా ఆమెను, ప్రియుడ్ని తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు.