సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల అబ్జర్వర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం సిద్దిపేట విపంచి కళానిలయంలో ఆయన సుడా వైస్ చైర్మన్ రమణాచారి, అసిస్టెంట్ కమిషనర్ నర్సయ్యతో కలిసి పీవో, ఏపీవోలకు ఎన్నికల నియమనిబంధనలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ మాట్లాడుతూ మున్సిపల్లో 43 వార్డులకు 60 లొకేషన్లు, ఒక్కో వార్డులో 3 పోలింగ్ కేంద్రాల చొప్పున 129 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఫామ్-7 ప్రకారం అభ్యర్థికి కేటాయించిన గుర్తు కాకుండా బ్యాలెట్ పత్రంపై వేరే గుర్తు వస్తే వెంటనే పైఅధికారులకు తెలుపాలన్నారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్, మూత్రశాలలు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు.
కేంద్రాల్లో కేంద్ర, రాష్ట్ర నాయకుల ఫొటోలు, పెయింటింగ్లు ఉన్నట్లయితే కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉంటుందని, ముందుగా వంద శాతం పూర్తయినా ఎన్నికల కమిషన్ తెలిపిన సమయం వరకు అధికారులు ఉండాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ బాక్సు సరిగ్గా ఉందో లేదో సీల్ పడుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు ఉన్నాయా అని సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో వాహనాల పార్కింగ్కు వీల్లేదన్నారు. కేంద్రాల్లో పీవో, ఏపీవోలు, ఏజెంట్లు, ఎంట్రీ, ఎగ్జిట్, మూత్రశాలలు గుర్తు పట్టేలా పేరుతో కూడిన స్టిక్కర్లు ఉండేట్లు చూడాలన్నారు. పోలింగ్ బూత్లో ఒక ఓటరు మాత్రమే ఉండాలన్నారు. ఓటరు 18 రకాల కార్డుల్లో ఏదేని ఫొటో గుర్తింపు కార్డును చూపితే ఓటు వేసేందుకు అనుమతించాలన్నారు. మైక్రో అబ్జర్వర్, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉంటాయన్నారు. అధికారులకు ఐడీ కార్డు తప్పనిసరి ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరపాలని సూచించారు.