సైదాబాద్ : లైంగికదాడికి గురై హత్యగావించబడిన ఆరేండ్ల చిన్నారి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత్ రాథోడ్ పరామర్శించారు. గురువారం ఉదయం సైదాబాద్ సింగరేణికాలనీకి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరుపున 20 లక్షల రూపాయల చెక్కును అందజేసి వారికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు, ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లోనే కోరుకున్న చోట డబుల్బెడ్రూం ఇల్లు అందిస్తామని, అదే విధంగా ప్రభుత్వం తరుపున ఆటోలేక, కారును జీవనోపాధి కోసం అందిస్తామని తెలిపారు.
చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నిందితుడిని కఠినంగా శిక్షించి, న్యాయం చేస్తామని మంత్రులు హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, టీఆర్ఎస్ పార్టీ యాకుత్పురా నియోజకవర్గం ఇంచార్జీ సామ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.