కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 26: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ప్యాక్స్, మార్కెటింగ్ అధికారులను కలెక్టర్ శరత్ ఆదేశించారు. ప్యాక్స్ సీఈవోలు, మార్కెటింగ్ అధికారులు, మిల్లర్స్ ప్రతినిధులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం ఆయన వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని, ట్యాబ్ ఎంట్రీ 63 శాతం మాత్రమే సాధించారని, ఎక్కువ స్థాయిలో నిర్వహించి రైతుల ఖాతాలో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో నాలుగు రోజుల్లో 80 శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. వ్యవసాయ ఏఈవోలు, ప్యాక్స్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, డీటీసీఎస్లు స్వయంగా కేంద్రాల్లో అన్లోడింగ్ పనులు పర్యవేక్షించాలని, లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో లారీల రవాణా పర్యవేక్షించాలన్నారు. రైస్ మిల్లర్లకు స్టోరేజీ సమస్య లేకుండా తాత్కాలిక స్టోరేజీ వసతులు కల్పించాలని ఆర్డీవోలకు సూచించారు.గన్నీ బ్యాగుల కొరత లేదని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి. వెంకట మాధవ్రావు, ఆర్డీవో ఎస్.శీను, జిల్లా సహకార అధికారి మమత, జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.