డెహ్రాడూన్: సాధువుగా నమ్మించి జ్యుయలరీ వ్యాపారి భార్యను రూ.1.75 కోట్ల మేర మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఈ ఘటన జరిగింది. మహేంద్ర రోడ్ అలియాస్ యోగి ప్రియవ్రత్ అనిమేష్ సాధువుగా అవతారమెత్తి మోసాలు చేస్తుంటాడు. ఉన్నత హోదా వ్యక్తులతో ఫొటోలు దిగి వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాడు. తద్వారా హై ప్రొఫైల్ వ్యక్తులను లక్ష్యగా చేసుకుని వారిని మోసగించేవాడు. ఈ క్రమంలో మానసిక స్థితి సరిగా లేని స్థానిక జ్యుయలరీ వ్యాపారి హితేంద్ర పన్వర్ భార్య అతడి మాయలో పడింది. అనిమేష్ మాయమాటలతో మభ్యపెట్టి రూ.1.75 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను ఆమె నుంచి తీసుకున్నాడు. ఈ మోసం గురించి తెలుసుకున్న హితేంద్ర దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పోలీసులు మహేంద్ర రోడ్ అలియాస్ యోగి ప్రియవ్రాత్ అనిమేష్ను లాల్ తప్పర్ ప్రాంతంలోని నేచర్ విల్లాకు చెందిన కాటేజ్ నెంబర్ 21 నుంచి ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు రిషికేశ్ డీఎస్పీ దినేశ్ చంద్ర ధౌండియాల్ సోమవారం తెలిపారు. పది లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగతా సొత్తును రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మోసగాడిపై హర్యానాలో కూడా పలు కేసులు నమోదయ్యాయని, గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లాడని డీఎస్పీ దినేశ్ వివరించారు.