రోజుకు 58 వేల మందికి పోషకాహారం
ప్రతి నెలా రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
మరో 40 వేల మంది చిన్నారులకు బాలామృతం
తల్లీ పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
బలోపేతమైన అంగన్వాడీ కేంద్రాలు
విజయవంతంగా అమలవుతున్న ఆరోగ్యలక్ష్మి
పోషణ్ అభియాన్ ద్వారా ప్రత్యేక అవగాహన
ఖమ్మం వ్యవసాయం, మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో రోజుకు వేల మంది చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం లభిస్తోంది. ఫలితంగా పోషకలోపం తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన సమాజానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి పాలనలో కేవలం ఏజెన్సీ ప్రాజెక్టులకే పరిమితమైన మధ్యాహ్న భోజనం పథకం ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఐదేళ్లుగా ఇప్పుడు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వివిధ రకాలైన రుచికరమైన భోజనం, కోడిగుడ్డు, 200 గ్రాముల పాలు అందుతున్నాయి. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య పెరిగింది.
అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు స్థానిక ఏఎన్ఏంలు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర, సత్తుపల్లి, కల్లూరు, కామేపల్లి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 1900 అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, మహిళలకు సేవలందుతున్నాయి. ఐసీడీఎస్తోపాటు చైల్డ్లైన్-1098, బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలి, సఖీ సెంటర్, ప్రత్యేక పోలీస్ విభాగాలు పని చేస్తున్నాయి. దీంతో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బాలల సమస్యలు తగ్గుముఖం పట్టాయి. చిన్నారుల్లో లోప పోషణ, రక్తహీనత తదితర సమస్యలను అధిగమించేందుకు పోషణ్ అభియాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.
రోజుకు 58 వేల మందికి పోషకహారం
ఉమ్మడి పాలన సమయంలో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద ఏజెన్సీ ప్రాజెక్టులో మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం జరిగిన కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో జిల్లాలోని 7 ప్రాజెక్టుల్లో ఉన్న 1,837 అంగన్వాడీ కేంద్రాల్లో 20,111 మంది గర్భిణులకు, బాలింతలకు, 38,055 మంది ప్రీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కలిపి రోజుకు ఒక్కొక్కరికీ రూ.21, చిన్నారులకు రూ.7 చొప్పున ఖర్చవుతోంది. తద్వారా ప్రభుత్వం నెలకు సరాసరిగా రూ.20.66 లక్షలను వెచ్చిస్తోంది. కరోనా సమయంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తిరిగి పోషకాహారాన్ని అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోషణ్ అభియాన్ అనే ప్రత్యేక మిషన్ను కూడా అమలు చేస్తున్నాయి.