హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రైల్వే బోగీల్లోని వాటర్ ట్యాంకులు ఇకపై నాలుగు నిమిషాల్లోనే నిండనున్నాయి. గతంలో ఒక ఎక్స్ప్రెస్ రైలులోని 24-25 బోగీల్లోని ట్యాంకులను నింపేందుకు 45 నిమిషాలు పడుతుండగా, క్విక్ వాటర్ సిస్టంగా పిలిచే కొత్త విధానంలో కేవలం నాలుగు నిమిషాల్లోనే నిండుతున్నాయి. నీటి వృథాను తగ్గించటడంతోపాటు సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ స్టేషన్లలో ఈ నూతన విధానాన్ని అమలుచేస్తున్నది. ప్రతి రైల్వే బోగీలో వాటర్ ట్యాంకు సామర్థ్యం 1,600 లీటర్లు. ఈ లెక్కన ప్రతి రైలుకు దాదాపు 40 వేల లీటర్ల నీళ్లు అవసరం. దగ్గర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఒక్కసారి నీటిని నింపితే సరిపోతుంది. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లలో తరచూ నీటిని నింపాల్సి ఉంటుంది. వాటర్పాయింట్ ఉన్న స్టేషన్లో నీటిని ఎక్కించడానికి గతంలో 45 నిమిషాల సమయం పట్టేది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడువటంతో ప్రయాణికులు ఇబ్బందిపడేవారు. నూతన విధానంతో ఈ సమస్యలు తొలగిపోయాయి. క్విక్ వాటర్ సిస్టంలో హైపవర్ మోటర్ల వినియోగంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడిందని, గతంలో ఒక్కరే నీటిని నింపుతుండగా, ఇప్పుడు ఐదుగురికిపైగా నియమించామని అధికారులు తెలిపారు.