కొత్తూరు, మే 2 : మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. సోమవారం కౌంటింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఓట్లను లెక్కించడానికి 3 వార్డులకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక ఆర్వో, ముగ్గురు అధికారులు ఉంటారు. ఒక్క రౌండ్లో 4 వార్డుల చొప్పున లెక్కించనున్నారు. 3 రౌండ్లల్లో ఫలితం తేలనున్నది.
నెగెటివ్ ఉంటేనే పాస్లు జారీ
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ సెంటర్కు వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికే పాసులు జారీ చేశారు. ఆదివారం ఉదయమే పోలీసులు, అభ్యర్థులు, అధికారులు, విలేకరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్టు ఇచ్చి నెగెటివ్ వచ్చిన వారికే పాసులు జారీ చేశారు. పాస్లు ఉన్నవారు మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జ్యోతి స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
ఆరంచెల భద్రత..
కౌంటింగ్ సెంటర్ వద్ద ఆరంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఐ శ్రీధర్ తెలిపారు. స్టాంగ్ రూం, కౌంటింగ్ సెంటర్, పార్కింగ్ మొదలైన చోట్ల ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకంటున్నామన్నారు. షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ పర్యవేక్షణలో 110 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. కొవిద్ దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కౌంటింగ్ సెంటర్లోకి తీసుకెళ్లొద్దన్నారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వివరించారు.