చెన్నై : ఆమె ధీరవనిత.. ఓ రాక్షస మృగంపై వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలను కాపాడుకుంది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన.. ఓ వ్యక్తిని అడ్డకుని హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని మిన్జూర్ ఏరియాలో గురువారం చోటు చేసుకుంది. 21 ఏండ్ల వయసున్న ఓ మహిళ తన భర్తతో కలిసి పొలం పనులకు వెళ్లింది. భర్త ఆమెకు కొంచెం దూరంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన ఓ వ్యక్తి.. ఆమె వద్దకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా, కిందకు తోసేసింది. ఆ తర్వాత బండరాయితో తలపై బాదింది. దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. అనంతరం అతన్ని రోడ్డుపైకి లాక్కొచ్చిన మహిళ.. తన భర్తకు విషయాన్ని తెలిపింది. స్థానికులంతా అక్కడ గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమెపై ఐపీసీ సెక్షన్ 100 (right of private defence of the body extends to causing death) కింద కేసు నమోదు చేశారు. ఆత్మరక్షణ కోసమే అతనిపై దాడి చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధిత మహిళకు ఎలాంటి శిక్ష విధించకుండా పోలీసులు వదిలేశారు.