చెన్నై : విద్యార్ధులను సరైన మార్గంలో నడిపించాల్సినే ఉపాధ్యాయుడే కామాంధుడై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. ఆన్ లైన్ క్లాసుల్లో విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్ పై స్టూడెంట్స్, సహోద్యోగులు ఫిర్యాదు చేసిన ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది. చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ కేకే నగర్ బ్రాంచ్ లో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్ బోధించే రాజగోపాలన్ బుద్ధి వక్రించి విద్యార్ధులను లైంగికంగా వేధిస్తూ వారికి వాట్సాప్ లో అభ్యంతరకర మెసేజ్ లు పెడుతున్నాడని ఫిర్యాదులు అందాయి. రాజగోపాలన్ చేష్టలపై పలువురు విద్యార్థినులు, బోధనా సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లైంగిక వాంఛలతో రగిలే రాజగోపాలన్ అదే తీరుతో విద్యార్థినీ, విద్యార్దులతో ముచ్చటిస్తారని వారు పేర్కొన్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టవల్ తో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే రాజగోపాలన్ స్టూడెంట్స్ ను కూడా టవల్ ధరించాలని కోరేవాడని, పలువురు విద్యార్థినుల శరీరాలపై వాట్సాప్ మెసేజ్ ల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవాడని పోస్టుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సంస్ధ డీన్ కు స్కూల్ సిబ్బంది లేఖ రాశారు. ఇక ఆఫ్ లైన్ క్లాసుల్లోనూ రాజగోపాలన్ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించేవాడని ఆరోపణలున్నాయి. విద్యార్థినులను అభ్యంతరకరంగా తాకడం, వారిపై లైంగిక వేధింపులకు గురిచేసేలా వ్యాఖ్యానిస్తాడని చెబుతున్నారు.