రూ.1.15 కోట్లు వసూళ్లు.. నిందితుడి అరెస్టు
రామచంద్రాపురం, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి రూ.1.15 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని ఆర్సీపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై కోటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రాజావారిపల్లికి చెందిన కొండూరి రాజేశ్ ఉద్యోగాలిప్పిస్తానని అమాయకులను నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఇతనిపై గతంలో మాదాపూర్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, చైతన్యపురి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో గతంలో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఉద్యోగాల పేరుతో మోసాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన మహిళకు ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ విడుతల వారీగా రూ.5,52,700 వసూలు చేశాడు. ఇదేవిధంగా నలుగురి నుంచి కూడా వసూలు చేశాడు. మొత్తంగా సుమారు రూ.1.15 కోట్ల మేర తన ఖాతాలో వేయించుకున్నాడు. కాగా, బాధితురాలు తేజస్విని తండ్రి మల్లికార్జున్రావు ఆర్సీపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈనెల 9న రాజేశ్ను అరెస్టు చేశారు. శనివారం నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుడు కొండూరి రాజేశ్ అలియాస్ కే రమేశ్, విష్ణువర్ధన్రెడ్డి, సుమిత్నేర్వాల్ ఇలా పేర్లు మార్చుకుంటూ అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి జల్సాలకు ఖర్చు చేసేవాడని ఎస్సై కోటేశ్వర్రావు తెలిపారు.