అమరావతి : కర్నూల్ జిల్లా ఆలూరు మండలం అరికెర రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్థానికులు రథాన్ని లాగుతుండగా రథానికి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. మృతులను శివ (25), లక్ష్మన్న(28)గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కార్మిక, పరిశ్రమశాఖల మంత్రి గుమ్మనూరు జయరాం దిగ్భాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేశారు. త్వరలో వైఎస్ఆర్ బీమా పథకం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులదేనని ఆయన అన్నారు.