అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా సీబీఐ వాచ్మెన్ రంగయ్యను విచారించి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ఇవాళ జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసినట్లు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసింది. ఆయన హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారు. తొమ్మిది మందికి హత్య ప్రమేయం ఉందని రంగన్న మేజిస్ట్రేట్ ఎదుట చెప్పాడని తెలిసింది. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు రంగయ్య పేర్కొన్నట్లు సమాచారం.
హత్యలో ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని చెప్పినట్లు వినికిడి. రహస్యంగా వాచ్మెన్ వాంగ్మూలం రికార్డు చేసిన సీబీఐ అధికారులు హత్యలో ప్రమేయం ఉన్న ప్రముఖులు ఎవరన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్మెన్ రంగయ్య, ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. 2 నెలలుగా సీబీఐ అనుమానితులందరినీ లోతుగా విచారిస్తున్న విషయం తెలిసిందే.