చెన్నై: తమినాడులోని ఆసుప్రతిలో తప్పిపోయిన ఓ మహిళా రోగి కేసు మర్డర్ మిస్టరీగా మారింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 ఏండ్ల సుమిత అనే రోగి మే 23 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త మౌలి మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ నెల 8న ఆసుపత్రి ఎనిమిదో అంతస్తులో కుళ్ళిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె దుస్తులు, బ్యాగ్ ఆధారంగా తన భార్య సుమితగా భర్త మౌలి గుర్తించారు. అయితే వినియోగంలోని లేని అంతస్తులో ఆమె ఎలా చనిపోయింది అన్నది మిస్టరీగా మారింది.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్ట్ వర్కర్ రాధిదేవిపై అనుమానం వ్యక్తం చేశారు. సుమిత వద్ద ఎవరూ లేకపోవడంతో డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. మే 22 అర్థరాత్రి తర్వాత రాధిదేవి సుమిత వార్డులోకి వచ్చింది. స్కానింగ్ కోసమంటూ ఆమెను వీల్ చైర్లో లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. వినియోగంలో లేని 8వ అంతస్తులోకి తీసుకెళ్లి సుమిత వద్ద ఉన్న డబ్బులు, సెల్ఫోన్ దోచుకున్నది. అనంతరం తాడుతో గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధిదేవిని ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు.