న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది ప్రయాణీకుల వాహన విక్రయాలు మందకొడిగా సాగిన క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 10.59 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మొత్తం 2,54.058 పాసింజర్ వాహనాలు అమ్ముడుపోయాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1274 ఆర్టీవో కార్యాలయాల నుంచి సేకరించిన గణాంకాల ఆధారంగా గత ఏడాది 2,29,734 పాసింజర్ వాహన విక్రయాలు సాగాయని తెలిపింది.
అయితే ద్విచక్రవాహనాల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 16.08 శాతం తగ్గి 10,91,288 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 13,00,364 వాహన విక్రయాలు సాగాయి. మరోవైపు వాణిజ్య వాహన విక్రయాలు సైతం ఫిబ్రవరిలో 29.53 శాతం పడిపోయాయి. ఇక ప్రయాణీకుల వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటి తెలిపారు.